కనువిప్పు.-story.

                                                              కనువిప్పు.
                                                     —————–

                       కనకయ్య శెట్టి కలియుగ కుబేరుడు.అతని ఇల్లు ఇంద్రభవనాన్నిమించి ఉంటుందని  ఆ కనకపురివాసులంతా భావిస్తారు. ఆయన ఇంటి దర్వాజా, గవాక్షపుతెరలే ఎంతోఖరిదైనవనీ, ఇంట్లోని దీపాలన్నీ వెన్నెలనువెదజల్లే చంద్రునికాంతిని మించి ఉంటాయనీ కధలుగాచెప్పుకుంటారు జనం. కనకయ్య శెట్టి ఇంటికి తూర్పుదిక్కున వేదవేద్యుడనే ఒక పేద వైదిక భ్రాహ్మణుని ‘ పాక ‘ఉంది.అది కనకయ్య శెట్టి ఇంట్లోని ఒక గదికంటే చాలా చిన్నది. ఆపాకలో ‘ వేదవేద్యుడు ‘ అతని భార్య ‘ వేదవతి ‘ , కుమారుడు విద్యాధరుడు ‘ నివశిస్తుంటారు.
                          ప్రతినిత్యం, కనకయ్య శెట్టి  కుంచెడు ధాన్యాన్ని ఉదయాన్నే ఇంటిముందుంచి  వచ్చే భిక్షువులకు గుప్పెడు చొప్పున  బిక్ష వేయమని ఒక పని వాడిని నియమించాడు.ఆవిధంగా చేయడం తన గొప్పదాతృత్వానికి నిదర్శనమని ఆయన భావన.తాను దాన కర్ణుడంతటివాడినని గర్వంగా అందరికీ చెప్పుకుంటుంటాడు.ఆయన తన పుట్టుపండుగను ఘనంగా చేసుకుని   , గొప్పవారినంతా విందుకు ఆహ్వానించేవాడు,ఆయన ఇంటిసంపదను వీక్షించను  పిలిచిన వారంతా తప్పక వచ్చేవారు. వారంతా ఆయన ఏర్పాటుచేసిన విందులోని వంటకాలు భోంచేస్తూ , ఆయన ఇంటిపక్క న ఉన్న వేదవేద్యుని గుణగణాలను ధార్మికతను పొగిడేవారు.అదికనకయ్యకు  కంటకంగా ఉండేది.
                        ఆఏడాది పుట్టుపండుగ పూర్తైన మరురోజున అందరూ అంతగా పొగుడుతున్న ఆవేదవేద్యుని గొప్పతన మేంటో తెల్సుకోవాలనిపించి , కనకయ్య శెట్టి ఉదయం నుండీ దీక్షగా  వేదవేద్యుని కుటీరాన్ని పరిశీలించసాగాడు.వేకువకుముందే ఇంటివారుముగ్గురూలేచి స్నానపానాదులు పూర్తిచేసుకుని , దైవకార్యం చేసుకునే వారు. పాకాముందు, చుట్టూతా వేదవతి చిత్రించే రంగులముగ్గులు ఎంతో హృద్యంగా చూపరులను ఆకట్టుకునేవి.ఆముగ్గులు ఏదోసందేశాన్నిస్తున్నట్లు , అంతరార్ధాన్ని చెప్తున్నట్లు ఉండటాన దారిన పోయేవారంతా ఆగి వీక్షించి వెళ్ళేవారు..తన పూరిపాక చుట్టూ పెంచుకున్న పూలు కోసి , మాలలుకట్టి దేవాలయంలో ఇచ్చివచ్చేది వేదవతి.కుమారుడు విద్యాధరుడు ఐదు ఇళ్ళలో భిక్షకు వెళ్ళి వచ్చిన పదార్ధాలు తల్లికి అందించగా ఆమె వాటిని వండాక  , అగ్నికార్యంచేశాక  వారు ముగ్గురూ అతిధికోసం ఎదురుచూసి , వచ్చిన అతిధి ఎవరైనాసరే , ఆయన పాదాలు కడిగి , తమ నట్టింట ,
భోజనం వడ్డించి,  సేవించి పంపేవారు . ఆపైన మిగిలిన పదార్ధాలను వారు భుజించేవారు.రోజంతా వారింట వేద పఠనం జరుగు తుండేది.మధ్యాహ్నం నుండి వేదవతి  జనావాసాలకు వెళ్ళి  వైద్య సేవలు అందించేది, ఆమె వైద్యంలో దిట్ట. విద్యాధరుడుపేద ధనిక అనే బేధంలేక విద్యకోసం తనవద్దకువచ్చే పిల్లలకు అందరికీ  విద్యాబోధన చేసేవాడు.  సాయంకాలానికి వారి ఇంటిముందుకు వచ్చిన వారికంతా వేదవేద్యడు అనే క శాస్ర్తాల  లనుండీ కధలు మానవతావిలువలు వివరిస్తూ , వారి ధర్మసందేహాలు తీర్చేవాడు. తమ వద్దకు వచ్చిన వారు అందించే ఫలాలను  భగవన్నివేదన చేసి అందరికీ పంచి వారూ ఒక్క ఫలాన్ని మాత్రమే భుజించేవారు.ఎల్లప్పుడూ చిద్విలాసంగా ఉండే వారిని చూసి కనకయ్య శెట్టికి ఈర్ష్య  పెరిగిపోయింది.
                   కనకయ్య శెట్టి ఒక సాయంకాలం బాగా గమనించాడు , తన ఇంటి గవాక్షాల గుండా తనఇంటి దీపాలకాంతి వేదవేద్యుని ఇంటి ముందు, ఇంట్లోకి ప్రసరించడం  సహించలేక ,ఆగవాక్షాలకు నల్లని తెరలు కట్టించాడు. అది అయన భవనానికి ఉన్న అందాన్ని తగ్గించగా , తన ఇంటిదీపాలకాంతి వేదవేద్యుని ఇంట పడనందుకు  కనకయ్య శెట్టి సంత సించాడు. ఐతే వేదవేద్యుడి ఇంట దేవుని ముందున్న చిన్న దీపం ఆయనం పూరిపాక నంతా వెలుగుతో నింపడం కనకయ్య శెట్టి గమనించి ఆశ్చర్యపోయాడు. 
                                 వేద వేద్యుడు అంత పేదరికంలోను ఎందుకంత ఆనందంగా ఉంటున్నాడో, అందరూ అతన్ని ఎందుకు పొగుడుతున్నరో తెల్సుకోవాలని , ఓమారు కనకయ్య శెట్టి సాయంకాలo అతడు చేసే సత్సంగానికి వెళ్ళాడు, తనను వేదవేద్యుడు  ప్రత్యేకంగా ఆహ్వానించనందుకు ఉడుక్కున్నా   , తమాయించుకుని కూర్చున్నాడు. వేద వేద్యుడు చెప్పేమాటలు   వింటూ , చివరగా ఒక్కోరూ  తమ సందేహాలు అడగ సాగారు.
                    ఒకవ్యక్తి ” మహాత్మా !తమరు మరోలా అనుకోకండి, తమరు ఇంత పేదరికంలోను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం తెల్సుకోవాలని చాలాకాలంగా నామనస్సు వేధిస్తోంది ” అని అడిగాడు.దానికి వేదవేద్యుడు చిరునవ్వుతో , ” మాకు పేదరిక మేముంది! ప్రతిరోజూ అతిధికి భోజనం పెట్టి తింటున్నాం.  ఆకలికి ఏనాడూ బాధపడలేదు. ధనం లేకపోడంపేదరికంకానేకాదు.  భావదారిర్ద్యమే నిజమైన దారిర్ద్యం.” అన్నాడు వేదవేద్యుడు.” మరి మహాత్మా! తమ శ్రీమతి వేదవతీదేవి ఎంతోమంది కి వైద్య సేవలు అందిస్తున్నారుకదా!   పేదలను వదిలేసినా, ధనవంతులవద్ద కొంత ధనం స్వీకరిస్తే తప్పులేదేమో!తమరు ఆధనాన్ని ఎటూ ఎవరికో  ఇచ్చేస్తారు   “   ” అనారోగ్యానికి ధనం , పేదరికమనే తేడాలు లేవుగదా! అది ఆమె ఎన్నుకున్న , ఆమెకు చేతనైన మానవసేవ, సేవకు వెలకట్టడం అధర్మం కదా! “   ” తమ కుమారులు ఎందరికో విద్యాదానంచేస్తున్నారు, వారివద్దనైనా కొంతధనం ….” ” తమరే విద్యాదానం అంటున్నారు! దానాన్ని ధనంతో కొలవడం అధర్మమే!’ అని పూరించాడు వేదవేద్యుడు.
   ” మహాత్ములారా! అవసరాన్ని మించినధనం గర్వాన్నికల్గిస్తుoది, భయం కౌగిట్లోకి చేర్చుతుంది. ఈర్ష్యకు దారి చేస్తుంది, పొగడ్తలనే విషగుళికలను  స్వీకరింపజేసి  అధోగతికి చేరవేస్తుంది. మనజన్మ సార్ధకంచేసుకోను జీవం ఉన్నంతవరకూ  సేవా ధనాన్ని పోగుచేసుకోను కృషి చేయాల్సి ఉంది. అందుకుభగవంతుడు అవసరమైన అవకాశం మాకు కలుగజేసినందుకు ఆయనకు సదాకృతఙ్ఞులం.  ” అని అందరికీ నమస్కరించాడు వేదవేద్యుడు. ఆయన్నంతగా అందరూ ఎందుకు  పొగుడు తున్నారో అర్ధమైన కనకయ్యశెట్టి తనతప్పు తెల్సుకుని తన ఈర్ష్య తననే వెక్కిరించగా సిగ్గుతో తల వంచుకున్నాడు.  

  రచన—ఆదూరి.హైమవతి

About these ads

hyma1947 గురించి

Retired headmistress, president awardee, kamci paramaguru sankaracarya goldmedalist.sathyasai devotee,balavikas guru.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s